బెంగళూరు : కర్నాటక హిజాబ్ వివాదం కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. బెదిరింపుల కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం.. వై కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించారు. బెదిరింపుల ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 15న కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
హిజాబ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లన్నీ కొట్టివేసిన కోర్టు.. ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు యూనిఫాం తప్పనిసరి, దీన్ని ఎవరూ నిరాకరించలేరని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి రీతురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం విచారించింది. తమ మతంలో హిజాబ్ ముఖ్యమైన భాగమని, తరగతి గదుల్లోనూ హిజాబ్ ధరించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బాలికల తరఫున పిటిషన్లు దాఖలవగా.. కోర్టు విచారణ జరిపి, ఈ నెల 15న తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.