నిందితులకు కర్ణాటక సర్కారు వత్తాసు
ఇలా అయితే ప్రజలను కాపాడేదెవరు?
అవినీతి అధికారి కేసులో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ సందేశ్ సంచలన వ్యాఖ్యలు
బెదిరింపులకు తలొగ్గబోయేది లేదని వెల్లడి
బెంగళూరు, జూలై 5: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే బెదిరింపులు వచ్చాయి. నిందితులను కట్టడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి వంత పాడటం గమనార్హం. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో పనిచేసే ఓ అధికారి రూ. 5 లక్షల లంచం తీసుకున్నాడు. ఈ కేసు విచారణ కర్ణాటక హైకోర్టులోని జస్టిస్ హెచ్పీ సందేశ్ బెంచ్ ముందుకు వచ్చింది. నిందితుడిని దోషిగా నిరూపించే సాక్ష్యాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ సమయంలో సమర్పించలేదు. నిందితుడిని కాపాడటానికే సదరు శాఖ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తమకు అనుకూలంగా తీర్పునివ్వాలని లేకుంటే బదిలీ మీద పంపుతామంటూ కొందరు జస్టిస్ సందేశ్కు కాల్స్ చేసి బెదిరించారు. దీనిపై న్యాయమూర్తి తాజాగా స్పందించారు.
రైతు బిడ్డను.. సాగు చేసైనా బతుకుతా
బదిలీ అవుతానని లేదా జడ్జి పదవి పోతుందని తాను భయపడట్లేదని జస్టిస్ సందేశ్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా నిందితులను ఎందుకు రక్షిస్తున్నదో తనకు అర్థం కావట్లేదని వాపోయారు. ‘ఇలాంటి చర్యలు జరుగాల్సింది కాదు. నాకు వచ్చిన బెదిరింపులను తీర్పులో కూడా పేర్కొంటా. న్యాయవ్యవస్థ, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన మీరు (అవినీతి నిరోధక శాఖ), కర్ణాటక ప్రభుత్వం.. నిందితులను ప్రోత్సహిస్తున్నది. నా జడ్జి పదవి పోయినా పర్వాలేదు. బెదిరించిన వారి పేర్లను, ఈ కుట్ర వెనక ఉన్న వారి పేర్లను తప్పక వెల్లడిస్తా. నేనెందుకు సంకోచించాలి?’ అని ప్రశ్నించారు. తనకు సుప్రీంకోర్టు జడ్జి కావాలన్న ఆశలేమీ లేవని, ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు లేవన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడుతారా? లేక దోషులను రక్షిస్తారా? అంటూ నిందితుడి తరుఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అవినీతి సమాజానికి క్యాన్సర్లా సోకిందని, నాలుగో స్టేజీ వచ్చే వరకు చూడకుండా, రెండో స్టేజీలోనే దాన్ని కట్టడి చేయాలని సూచించారు. తాను రైతు బిడ్డనని, బతికిఉన్నంతవరకూ వ్యవసాయం చేసి నలుగురికి తిండి పెట్టగలనన్నారు.