బెంగళూరు, ఏప్రిల్ 7: కర్ణాటకలో మళ్లీ కలరా కలకలం రేగింది. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు(బీఎంసీఆర్ఐ) చెందిన ఇద్దరు విద్యార్థులకు కలరా పాజిటివ్ తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు. డయేరియా, డీహైడ్రేషన్ వంటి కారణాలతో దవాఖానలో చేరిన 47 మంది విద్యార్థుల్లో వీరిద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇతరులకు కలరా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించింది. బీఎంసీఆర్ఐ హాస్టల్ కిచెన్ను మూసివేసి, డిస్ఇన్ఫెక్షన్ చర్యలు చేపట్టారు. పెస్ట్ కంట్రోల్ చర్యలు కూడా తీసుకొంటున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు కలరా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఐదు ఒక్క మార్చి నెలలోనే రిపోర్టు అయ్యాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొన్నది.