DK Shivakumar | బెంగళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తులపై సీబీఐ కేసును ఉపసంహరిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శివకుమార్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, కేసును వెనక్కి తీసుకోవటం అనైతికం, చట్ట విరుద్ధమని బీజేపీ, జేడీ(ఎస్) ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశాన్ని అసెంబ్లీ లోపల, బయట లేవనెత్తుతామని విపక్షాలు గురువారం ప్రకటించాయి. ‘కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం క్షమించరాని తప్పు. డీకేను కాపాడుతూ ప్రభుత్వం ఇలా చేయటం ప్రజల్ని మోసం చేయటమే’ అని మాజీ సీఎం యెడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించటాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించిందని, ఇప్పుడు కేసును ఉపసంహరిస్తూ నిర్ణయం చేసే అధికారం ఎవరికీ లేదని, ఇది చట్ట విరుద్ధమని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘డీకే శివకుమార్ అక్రమాస్తుల వ్యవహారంపై దర్యాప్తు చేసిన ఈడీ.. అవినీతి ఆరోపణలు నిజమేనని తేల్చింది. సరైన చర్య తీసుకోవాలని ఆనాడున్న ప్రభుత్వానికి సూచించింది. అడ్వొకేట్ జనరల్ సలహా మేరకు కేసును సీబీఐకి అప్పగించాం. సీబీఐకి అప్పగించాలా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. దాని ప్రకారం నిర్ణయం చేశాం’ అని అన్నారు