IAS vs IPS | బెంగళూరు: కన్నడనాట ఇద్దరు ఉన్నతాధికారులు సోషల్ మీడియా వేదికపై బహిరంగంగా ఒకరిపై ఒకరు చేసుకొన్న విమర్శల ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కాగా, మరొకరు ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్. ఈ వ్యవహారం నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ వేటు వేసింది. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతూనే ఉన్నది. తమ కుటుంబాన్ని కాపాడుకొనేందుకు తాను పోరాడుతున్నానని.. తాను, తన భర్త ఇప్పటికీ కలిసే ఉన్నామని పేర్కొనడంతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఇద్దరు ఉన్నతాధికారుల మరణాలు, కర్ణాటకలో ఓ ఐఏఎస్ జంట విడాకులు తీసుకోవడాన్ని రూపా మౌద్గిల్ తన తాజా ఫేస్బుక్ పోస్టులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో మైసూర్కు చెందిన గంగరాజు అనే ఆర్టీఐ కార్యకర్త లీక్ చేసిన 25 నిమిషాల ఆడియో క్లిప్ మరింత ప్రాధాన్యం సంతరించుకొన్నది. ‘ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సాయం చేయాలని ఐఏఎస్ అధికారిణి రోహిణి.. నా భర్త(మునీశ్)ను పదేపదే కాంటాక్ట్ అయ్యారు. మునీశ్ను సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్ పోస్టు నుంచి బదిలీ చేయాలి’ అని ప్రభుత్వాన్ని రూప కోరినట్టు అందులో ఉన్నది. అటు రూపాకు సింధూరి లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించినందుకు, మానసిక వేదన కలిగించినందుకు రూ.కోటి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల వివాదం వ్యవహరంపై రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ వందిత శర్మ నేతృత్వంలో శాఖాపరమైన విచారణను ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎస్ రూప ఓ సందర్భంగా ఫోన్లో తనతో మాట్లాడారని గంగరాజు పేర్కొన్నారు. ‘రోహిణికి సపోర్టు చేయడం సరైనదేనా? అని ఆమె నన్ను ప్రశ్నించారు. రోహిణి భర్తకు సంబంధించిన భూవివాదాల విషయంలో రోహిణికి, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్ మునీశ్కు మధ్య నేను మధ్యవర్తిగా ఉన్నట్టు రూపా ఆరోపించారు. తన భర్త డీల్ చేయాలనుకొంటున్న భూములపై వివాదాలు ఉన్నాయా అని తెలుసుకొనేందుకు మునీశ్కు రోహిణి ఫోన్ చేసేవారని రూప నాకు ఫోన్లో చెప్పారు’ అని గంగరాజు తెలిపారు.
గత ఆదివారం రోహిణి వ్యక్తిగత ఫొటోలను రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని గతంలో రోహిణి పలువురు పురుష అధికారులకు కూడా షేర్ చేశారని ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రోహిణిపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రూపా వ్యాఖ్యలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూప తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని, తన పరువుకు భంగం కలిగించేందుకు సోషల్ మీడియా స్క్రీన్షాట్లు సేకరించారని పేర్కొన్నారు. తాను ఆ ఫొటోలను పంపినట్టు చెప్తున్న ఐఏఎస్లు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.