Congress | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీకి కర్ణాటక కాంగ్రెస్ తూట్లు పొడిచింది. పేదలు, వివిధ పనుల కోసం బెంగళూరు నగరానికి వచ్చే సామాన్యులకు, కార్మికుల కడుపునింపేందుకు తీసుకొచ్చిన ఇందిర క్యాంటీన్లను క్రమంగా మూసేస్తున్నది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఆధ్వర్యంలో బెంగళూరు నగరవ్యాప్తంగా 175 శాశ్వత ఇందిర క్యాంటీన్లు, మరో 24 మొబైల్ క్యాంటీన్లు, 19 కిచెన్లు నడిచేవి. ఇందులో 23 క్యాంటీన్లకు (6 శాశ్వత క్యాంటీన్లు, 17 మొబైల్ క్యాంటీన్లు), మరో 11 కిచెన్లకు తాజాగా తాళం వేశారు. ఆహారాన్ని సరఫరా చేసే సప్లయర్లకు, క్యాంటీన్ల నిర్వాహకులకు చెల్లింపుల్లో జాప్యం జరుగడమే క్యాంటీన్ల మూసివేతకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. నిధుల కొరతతో చెల్లింపుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని బీబీఎంపీ అధికారులు అంగీకరించారు.
అన్నింటా సమస్యలే
2017లో ఈ పథకం కింద అల్పాహారం (రూ.5), మధ్యాహ్నం, సాయంత్రం భోజనాన్ని (రూ.10 చొప్పున) వడ్డించేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ‘ఇందిర క్యాంటీన్ల’ను మరింతగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఈ స్కీమ్ను క్రమంగా అటకెక్కిస్తున్నారు. క్యాంటీన్లను నిర్వహించే వారికి చెల్లింపులు చేయకపోవడమే కాదు.. నీరు, కరెంటును కూడా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయట్లేదు. మొబైల్ క్యాంటీన్ల కోసం సిద్ధంచేసిన వాహనాలు పాడైనప్పటికీ మరమ్మతులు నిర్వహించకపోవడంతో అవి మూలకుపడ్డాయి.
రాజస్థాన్లో ఇందిర క్యాంటీన్లలో అక్రమాలు..
అర్ధాకలితో పడుకుంటున్న పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రారంభించిన ఇందిర క్యాంటీన్లు రాజస్థాన్లో అవినీతికి నిలయాలుగా మారాయి. నాగోర్ పట్టణంలో ఒక మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో అక్రమాలు బయటపడ్డాయి. క్యాంటీన్ల సిబ్బందే బట్టలు మార్చుకుంటూ భోజనం ప్లేటు తీసుకుంటున్నట్లు స్టింగ్ ఆపరేషన్లో తేలింది. ఓ మహిళ మూడు సార్లు బట్టలు మార్చుకుని భోజనం టోకెన్ తీసుకుంది. ఓ క్యాంటీన్లో 30 మంది మాత్రమే తిన్నట్లు తేలగా రికార్డుల్లో 200 మంది భోజనం తిన్నట్లు ఉంది. ఈ లెక్కన చూస్తే ఆ ఒక్క పూట ఆ ఒక్క క్యాంటీన్లోనే రూ. 2,890ను దొంగ లెక్కలతో దోచుకున్నట్టు తేలింది.
అన్నార్తులకు అక్షయపాత్ర
ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి అమలవుతున్న ‘అన్నపూర్ణ పథకం (రూ. 5కే భోజనం)’ ద్వారా గత ఏప్రిల్నాటికి 10.52 కోట్ల మందికి నాణ్యమైన భోజనం లభించింది. ఈ స్కీమ్లో భాగంగా రూ. 5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పు, ఒక కూరతో పాటు 15 గ్రాముల పచ్చడి, ఓ నీటి ప్యాకెట్ను అందిస్తున్నారు. ఒక్కో భోజనం తయారీకి రూ. 27.5 ఖర్చు అవుతుండగా, జీహెచ్ఎంసీ రూ. 22.5 భరిస్తున్నది. ఈ పథకం దవాఖానలు, ద్వితీయశ్రేణి పట్టణాలతో కలిపి 373 కేంద్రాలకు చేరింది.
బెంగళూరులో అలా…
స్కీమ్పేరు: ఇందిర క్యాంటీన్లు
ప్రారంభం: 2017
మొత్తం క్యాంటీన్లు: 199
మూతబడ్డవి: 23 కేంద్రాలు
తెలంగాణలో ఇలా..
స్కీమ్పేరు: అన్నపూర్ణ
ప్రారంభం: 2014
మొత్తం కేంద్రాలు: 373
మూతబడ్డవి: 0
ఏటా తెలంగాణ-అన్నపూర్ణ భోజనాల పంపిణీ వివరాలు ఇలా..
సంవత్సరం : భోజనాల సంఖ్య
2014-15 : 9,12,685
2015-16 : 27,12,046
2016-17 : 38,49,620
2017-18 : 95,59,676
2018-19 : 1,03,06,590
2019-20 : 89,63,665
2020-21 : 2,29,46,080
2021-22 : 3,36,87,830
2022-23 : 72,31,210
2023 (ఏప్రిల్వరకూ) : 28,60,540
మొత్తం : 10,52,59,162