Bengaluru | వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం యథాతథంగా అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి జరగకూడదన్న ఉద్దేశంతోనే నైట్ కర్ఫ్యూను ఉంచుతున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువ మోతాదులో లేదని, అందుకే వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలని సాంకేతిక అడ్వైజరీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేస్తూ బొమ్మై సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగితే మాత్రం మళ్లీ వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తాం అని రెవిన్యూ మంత్రి అశోక్ ప్రకటించారు. ప్రజలు మరింత బాధ్యతాయుతంగా మసులుకోవాలని, కోవిడ్ నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.