Karnataka elections | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నులు తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ చైర్మన్ బస్వరాజ్ బొమ్మై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అపాయింట్మెంట్ అడిగితే అవహేళన చేసిన బస్వరాజ్ బొమ్మై కి తగిన గుణపాఠం చెప్పేందుకు గతేడాది అఖిల భారత పద్మశాలీ సంఘం కర్ణాటకలో పని చేస్తుందని, ప్రత్యేక వ్యూహాన్ని అమలుపరిచినట్లు తెలిపారు.
జనవరి 5న జీరో జీఎస్టీ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కర్ణాటక విధాన సభ కమిటీ హాల్లో చేనేత విభాగం పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో జీరో జీఎస్టీ ఉద్యమ వార్షికోత్సవ సమావేశం నిర్వహించిందన్నారు. మాజీ ఎంపీ కేసీ కొండయ్య నాయకత్వంలో జరిగిన సమావేశానికి 29 చేనేత కుల సంఘాలు హాజరయ్యాయని, అప్పటి నుంచి కర్ణాటకలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రచించిందన్నారు. పద్మశాలీలు తమ ఓటు ద్వారా బీజేపీకి సరైన జవాబు ఇచ్చారన్నారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి తమ ఓటు ద్వారా మద్దతు పలికిన కన్నడ చేనేతలకు, చేనేత కుటుంబాలకు, మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చేనేతపై జీఎస్టీ పన్నును తొలగించే వరకు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో అఖిల భారత చేనేత సంఘం పని చేస్తుందన్నారు. అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారుడు జీరో ఉద్యమానికి బాసటగా నిలిచారని, ఆగస్టు 7న ఢిల్లీలో చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలని మహా ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. 2024లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీరో జీఎస్టీ అంశాన్ని జాతీయ ఎన్నికల ఎజెండాగా మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి.. చేనేతల ఆకాంక్షలను గౌరవించి.. జీఎస్టీని తొలగించాలన్నారు.