Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 11: ఎడాపెడా హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు కూడా పూర్తికాకముందే ప్రజాగ్రహాన్ని మూటకట్టుకుంటున్నది. ఆల్కహాల్ నుంచి వాటర్ చార్జీల వరకూ అన్నింటి రేట్లను ఎడాపెడా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నది. ఈ ధరల భారానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు విపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు సిద్ధమవుతున్నాయి. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు 135 సీట్లతో (మొత్తం 224) పూర్తి మెజారిటీలో అధికారాన్ని అప్పగించారు. ఈ రెండేళ్ల వ్యవధిలో సిద్ధూ సర్కార్, డీజిల్, విద్యుత్, మెట్రో, ఆర్టీసీ, ప్రైవేట్ బస్ చార్జీలు, పాలు, పెరుగు, నీటి బిల్లులు, ఆఖరికి చెత్త చార్జీలు కూడా దారుణంగా పెంచేసి ప్రజలపై అదనపు భారం వేసింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా కిందా మీదా అవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పెంచిన ధరలను తట్టుకోలేకపోతున్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బదులు కాంగ్రెస్ ‘ధరల పెంపు గ్యారెంటీ’ని అమలు చేస్తున్నదని బీజేపీ రాష్ట అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. నిత్యావసరాల ధరల పెంపు, ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తుంటే కాంగ్రెస్ దుష్పరిపాలన ఎలా వుందో అర్థమవుతున్నదని ఆరోపిస్తూ బీజేపీ 16 రోజుల ‘జనాక్రోశ’ ఆందోళనను ప్రారంభించింది.
కాగా, రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, పెచ్చుమీరుతున్న అవినీతిని నిరసిస్తూ ‘ఇక చాలు కాంగ్రెస్’ పేరుతో ఈ నెల 12న బెంగళూరు ఫ్రీడమ్ పార్కు వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. పెంచిన డీజిల్ ధరను తగ్గించాలని, హైవేలపై చెక్పోస్టులు తొలగించాలని, పెంచిన టోల్ చార్జీలు తగ్గించాలని ఈ నెల 15 నుంచి నిరవధిక ఆందోళన చేయనున్నట్టు కర్ణాటక రాష్ట్ర లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ మరోసారి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఇతరుల జోక్యం ఎక్కువైందని ఆరోపిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రుల బంధువులపై నేరుగా ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ పాలనలో అవినీతి తారస్థాయికి చేరుకుందని, వారు గత బీజేపీ పాలకుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు డీ మంజునాథ్ ఆరోపించారు.
గత బీజేపీ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతం లంచాలను డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ విషయం తాము సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని, అయినా ప్రయోజనం శూన్యమని అన్నారు. చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు కుమారుడు , పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి అల్లుడు బిల్లుల మంజూరులో జోక్యం చేసుకుంటున్నారన్నారు. వెంటనే కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్కు ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ఈ అక్రమాల్లో పాత్రధారులందరి పేర్లు బయటపెడతామని ఆయన హెచ్చరించారు.
A. ఆల్కహాల్: మద్యంపై 20%, బీరుపై 10% పన్ను పెంపు
B. బస్సు చార్జీలు: కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీలపై 15% పెంపు.
C. క్యాబ్స్: ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాలపై 3% రవాణా పన్ను.
D. డీజిల్ ధర: 2025 ఏప్రిల్ నుంచి లీటర్కు రూ.2 పెంపు.
E. ఎలక్ట్రిసిటీ: యూనిట్ ధర 36 పైసలు, ఫిక్స్డ్ చార్జీలు పెంపు.
F. ఫ్యూయల్: 2024 జూన్ నుంచి పెట్రోల్, డీజిల్ ధర లీటర్కు రూ.3 పెంపు.
G. గైడెన్స్ విలువ: ఆస్తులపై 15-30% పెంపు.
H. హచ్బ్యాక్, లగ్జరీ క్యాబ్ చార్జీలు పెంపు
I. ఇండస్ట్రీ హిట్: డీజిల్, విద్యుత్, నీటి ధరల పెంపు.
J. జర్నీ: ప్రైవేట్, ప్రభుత్వ బస్సు చార్జీల పెంపుతో ప్రయాణం భారం.
K. కర్ణాటక ఓకేస్: ప్రైవేట్ కాలేజీల ఫీజు పెంపు.
L. లైఫ్టైం ట్యాక్స్: 25 లక్షల పైబడి విలువున్న ఈవీలపై 10% పన్ను.
M. మెట్రో: రైలు చార్జీలు 71% వరకు పెంపు.
N. నందిని: పాలు, పెరుగు లీటర్కు రూ.4 పెంపు.
O. ఓటీటీ: సినిమా టికెట్లపై 2% అదనపు సెస్.
P. పార్కింగ్: బెంగళూరులో వాణిజ్య, నివాస ప్రాంతాలలో చార్జీలు పెంపు.
Q. క్వారీ: ఫీజు పెంపు.. తద్వారా అధికమైన నిర్మాణాల భారం.
R.రెంటల్: అగ్రిమెంట్లపై స్టాంప్ డ్యూటీ 200-500 శాతం పెంపు
S. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్: పన్ను ఆస్తిపన్నుకు జత.
T. టోల్: ఎయిర్పోర్టు రోడ్ సహా హైవేలపై 3-5 శాతం చార్జీల పెంపు.
U. యూనియన్ గవర్న్మెంట్: ఎల్పీజీపై రూ.50 పెంచిన కేంద్రం
V. వెహికల్: రిజిస్ట్రేషన్ చార్జీ రూ.500-1000 అదనం.
W. వాటర్: చార్జీలు పెంపు (బెంగళూరులో).
X. ఎక్స్రే: ఓపీడీ, ల్యాబ్ చార్జీలు 50-100 శాతం పెంపు.
Y. యువర్ బడ్జెట్: కూరగాయలు, పండ్లు, స్కూల్ ఫీజుల పెంపు, జాతీయ సగటు (3.61) కన్నా రాష్ట్ర ద్రవ్యోల్బణం (4.49 శాతం) అధికం.
Z. జొమాటో, అమెజాన్, ర్యాపిడో, ఇతరులపై గిగ్ వర్కర్ల ఫండ్ కోసం 5% సుంకం విధింపు.