బెంగళూరు: యెడియూరప్ప కన్నీళ్లతో కర్ణాటక బీజేపీ కొట్టుకుపోతుందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక మఠాధిపతి హెచ్చరించారు. నెల రోజుల ఉత్కంఠకు తెరదించుతూ యెడియూరప్ప సోమవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో బాలెహోసూర్ మఠానికి చెందిన దింగలేశ్వర స్వామి దీనిపై స్పందించారు. ‘బీఎస్ యెడియూరప్ప చాలా బాధతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన కన్నీళ్లతో కర్ణాటక బీజేపీ కొట్టుకుపోతుంది. బీజేపీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి’ అని దింగలేశ్వర స్వామి వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఇటీవల యెడియూరప్పను కలిసి ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ఆదివారం కూడా వారు బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
2019 జూలై 26న నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యెడియూరప్పపై పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగింది. దీంతో బీజేపీ అధిష్ఠానం ఒత్తిడితో సీఎం పదవికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి ముందు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండేళ్లైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన కంటతడి పెట్టారు.