హైదరాబాద్, మార్చి 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి 400కు పైగా సీట్లను కట్టబెడితే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ కర్ణాటక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. లోక్సభ ఎన్నికలవేళ ఈ పరిణామం బీజేపీకి కొత్త తలనొప్పులు కూడా తీసుకొచ్చింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కమలదళం.. ఉత్తర కన్నడ ఎంపీ టికెట్ ఇవ్వకుండా అనంత్కుమార్ హెగ్డేను పక్కనబెట్టింది. ఆ స్థానం నుంచి స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరీని బరిలోకి దింపింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు ఇస్తే, హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని కర్వార్లో ఇటీవల జరిగిన ఓ సభలో ఎంపీ అనంత్కుమార్ అన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని కూడా తొలగిస్తామన్నారు. ‘హిందువులకు అనుకూలమైన రాజ్యాంగం రావాలంటే మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్సభలో అధిక సీట్లు ఇవ్వాలి. బీజేపీకి లోక్సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల్లో 2/3 వంతుల మెజార్టీ ఉండాలి’ అని పేర్కొన్నారు. ప్రధానంగా హిందూ సమాజాన్ని అణచివేసే లక్ష్యంతో కాంగ్రెస్ గతంలో పలు చట్టాలను తీసుకొచ్చిందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇదంతా మారాలంటే.. ప్రస్తుతం ఉన్న మెజార్టీతో బీజేపీకి సాధ్యం కాదని అన్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని హెగ్డేకు ఇటీవలే నోటీసులు పంపించిన బీజేపీ అధిష్ఠానం.. తాజాగా టికెట్ను నిరాకరించింది.