Karnataka | కర్ణాటకలో (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మైపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. 40 శాతం కమిషన్ ముట్టనిదే పనులేవీ కావని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) కొడుకు రూ.40 లక్షలు లంచం (Bribe) తీసుకుంటూ రెడ్హాండెడ్గా పట్టుబడ్డాడు. అతని ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీగా నోట్లకట్టలు బయపడ్డాయి. దీంతో పోలీసులు ఆయనను శుక్రవారం ఉదయం అరెస్టుచేశారు.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త (Lokayukta) అధికారులు పట్టుకున్నారు. వాటితోపాటు ఆఫీస్లో లభించిన మరో రూ.కోటీ 40 లక్షలు సీజ్చేశారు.
విచారణ అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 6 కోట్లు లభించాయి. దీంతో ఆయనను అధికారులు అరెస్టుచేశారు. ఆయన తండ్రి తరఫున లంచం తీసుకుంటున్నట్లు తేలిందని వెల్లడించారు. ఇంత నగదు ఎలా వచ్చిందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఇదే విషయమై త్వరలోనే ఎమ్మెల్యే విరూపాక్షప్పకు కూడా లోకాయుక్త అధికారులు నోటీలు జారీ చేసే అవకాశం ఉంది.