హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘ఏమీ లేనిచోట గాయి.. దొరికిన చోట మౌనమేనోయి..!’.. ఇదే బీజేపీ నేతలకు తెలిసిన గురివింద నీతి. ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో పోలీసు పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు వెలుగుచూడడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నది. ఇప్పటికే కన్నడ కాంట్రాక్టర్లు ‘40శాతం లంచాల సర్కార్’గా బీజేపీ ప్రభుత్వానికి నామకరణం చేయగా.. ఇప్పుడు కర్ణాటక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) రిక్రూట్మెంట్ స్కామ్లో బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆధారాలు బయటపడటం కలకలం రేపుతున్నది. ఈ కుంభకోణంలో రోజుకో పేరు.. పూటకో ఆధారం బయటకు వస్తుండడంతో బొమ్మై సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరోవైపు తెలంగాణలో పోలీసు నియామక ప్రక్రియ చిన్న మరకైనా అంటకుండా అత్యంత పారదర్శకంగా సాగింది. పకడ్బందీగా చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క ఆరోపణా రాలేదు. అయితే ఏమీ లేకపోయినా తెలంగాణపై నిత్యం నోరుపారేసుకునే బీజేపీ నేతలు మాత్రం.. తమ ఏలుబడిలోని కర్ణాటకలో వరుస కుంభకోణాలు బయటపడుతున్నా నోరువిప్పడం లేదు.
అంతులేని అవినీతి.. ఆగని అరెస్టులు
కర్ణాటక పోలీసు సబ్ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) రిక్రూట్మెంట్లో ఏకంగా ఆ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) అమృత్పాల్ అరెస్టయ్యారంటే నియామకాల్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఐపీఎస్ అధికారి సర్వీస్లో ఉండగా కుంభకోణం ఆరోపణలతో అరెస్టు కావడం.. ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఏడీజీతోపాటు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది ఇలా ఇప్పటి వరకు దాదాపు 70మందిని అరెస్టు చేశారు. బీజేపీ నాయకులు, పోలీసు అధికారులు కలిసి కథ నడిపించారు. మొత్తం 545 ఎస్సై పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో.. రాతపరీక్ష నుంచే అవినీతికి తెరలేపారు. కలబుర్గిలో జ్ఞానజ్యోతి ఇంగ్లిష్మీడియం పాఠశాల కేంద్రంగా ఆన్సర్షీట్ల మార్పిడికి పాల్పడ్డారు. సంబంధిత స్కూల్ యజమాని, బీజేపీ కలబుర్గి శాఖ మహిళా అధ్యక్షురాలు దివ్య హగరాగిని పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఒక్కో పరీక్షార్థి నుంచి రూ.15లక్షల వరకు లంచంగా తీసుకుని ఆన్సర్షీట్లను మార్చేశారని బయటపడింది. కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యే గన్మెన్తోపాటు ఈ పీఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారిని పలువురిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం కుంభకోణం జరిగిన ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది, హెడ్మాస్టర్ సైతం అరెస్టయిన వారి జాబితాలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్లో మొత్తం 545 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మొత్తం 54,287 మంది పోటీ పడగా..ఇందులో అర్హత సాధించిన చాలా మంది అభ్యర్థులు తప్పుడు మార్గాల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
యెడియూరప్ప అనుచరుడి ఆడియో వైరల్
పీఎస్ఐ కుంభకోణానికి సంబంధించి తాజాగా ఓ ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప ప్రధాన అనుచరుడు, బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడేసుగూర్, ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్కు మధ్య జరిగిన సంభాషణ అంతా అందులో ఉంది. రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడికి ఎస్సై ఉద్యోగం ఇప్పించేందుకు రూ.15లక్షలు తీసుకున్నారని, ఏడాదిన్నర గడిచినా ఉద్యోగం ఇప్పించలేకపోవడంతో బాధితుడు ఎమ్మెల్యేను నిలదీయడం అందులో స్పష్టంగా రికార్డయ్యి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో ఈ బీజేపీ ఎమ్మెల్యే పాత్రపై సీఐడీ విచారణకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించక తప్పలేదు. కర్ణాటక సీఐడీ జరుపుతున్న లోతైన దర్యాప్తులో మరిన్ని కొత్త పేర్లు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తుండడం ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ స్కామ్తో డైరెక్ట్గా లింకులు ఉన్నట్టు ఆధారాలు బయటికి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులతోపాటు బీజేపీ మంత్రులు సైతం ఇందులో ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేపీటీసీఎల్ నియామకాల్లోనూ అవినీతి
కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) పరిధిలోని 1,492 పోస్టుల భర్తీకి గత నెల 7న నిర్వహించిన పరీక్షలోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తున్నది. ఉదయం లేచినదగ్గరినుంచీ నీతులు వల్లించే బీజేపీ నేతల నోటికి.. కర్ణాటక వరుస కుంభకోణాలతో తాళం పడింది. అవినీతి కేసుల్లోనూ బీజేపీ పాలిత రాష్ర్టాలే రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2020లో 84 అవినీతి కేసులను ఏసీబీ నమోదు చేయగా, 2021లో ఆ సంఖ్య 83కు తగ్గింది. అయితే బీజేపీ పాలిత కర్ణాటకలో మాత్రం 2020లో 296 ఏసీబీ కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 360కి పెరిగింది. మధ్యప్రదేశ్లో 2020లో 151 ఏసీబీ కేసులు నమోదైతే, 2021లో అవి ఏకంగా 250కి చేరాయి.
తెలంగాణలో అత్యంత పారదర్శకంగా పోలీస్ నియామకాలు
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కేవలం 545 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీలో భారీ కుంభకోణానికి తెరతీస్తే.. తెలంగాణ రాష్ట్రంలో వేల సంఖ్యలో జరుగుతున్న పోలీస్ నియామకాల్లో ఒక్కటంటే ఒక్క ఆరోపణ రాకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 15,644 సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్పోర్ట్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోలీసుల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తున్నది. ఈ పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అదేవిధంగా 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న నిర్వహించిన పరీక్షలోనూ 2,25,759 మంది పోటీపడ్డారు. వేలసంఖ్యలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా, లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతున్నా.. ఎక్కడా ఏ ఆరోపణలకూ తావులేదు. పూర్తి సాంకేతికతతో పారదర్శకంగా, పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. వేల సంఖ్యలో పోలీసు కొలువుల భర్తీలో తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.