BJP’s Preetham Gowda | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కర్నాటక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ నేత ఓ వర్గం ఓటర్లు తనకు ఓటు వేయలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తానేంటో వారికి చూపిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హసన్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ జేడీఎస్ అభ్యర్థి హెచ్పీ స్వరూప్ చేతిలో ఓడిపోయారు.
ఓటమి భరించలేని ప్రీతం గౌడ.. తన ఓటమికి ముస్లింలే కారణమని పరోక్షంగా పేర్కొంటూ, వారు తనకు ఓటేయలేదని చిందులు తొక్కారు. తానేంటో, తన శక్తి ఏంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో వారిని దేవుడే రక్షించాలని, తన పవరేంటో చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రీతం గౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గత డిసెంబర్లో ఓ వివాదాస్పద వీడియో దుమారం లేపింది. ఆ వీడియోలో ప్రీతం గౌడ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓటేయకపోతే, వారికి ఏ పనీ చేయనని హెచ్చరించారు.