బెంగళూర్ : బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండాగా మారుతుందని వ్యాఖ్యానించారు. త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నారు. ఈ దేశంలో ఎప్పటినుంచో కాషాయ జెండాకు గౌరవం ఉందని, వేల సంవత్సరాలుగా కాషాయ జెండా త్యాగానికి సంకేతంగా నిలిచిందని చెప్పారు.
ఆరెస్సెస్లో కాషాయ జెండా ముందు నిలుచుని ఆ విలువలు తమలో నిండాలని కోరుకునేవారమని అన్నారు. రేపోమాపో ఏదో ఒకరోజు కాషాయ పతాకం జాతీయ పతాకంగా నిలుస్తుందని..ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం మూడు రంగుల జెండా మన జాతీయ పతాకమని, దానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతవరకూ ఇస్తామని చెప్పారు.
కాగా, మంత్రి ఈశ్వరప్ప తనను ముడుపులు డిమాండ్ చేశాడని ఆరోపించిన కాంట్రాక్టర్ మరణించిన ఉదంతంలో ఈశ్వరప్పను క్యాబినెట్ నుంచి తప్పించారు. ఇక గతంలోనూ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము ఎర్రకోట సహా ప్రతిచోటా కాషాయ జెండాను ఎగురవేస్తామని, భారత్ త్వరలోనే హిందూ దేశంగా అవతరిస్తుందని ఫిబ్రవరి 9న ఆయన అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అసెంబ్లీ లోపల వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.