Nalin Kumar Kateel | ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేయడం కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్కు అలవాటుగా మారింది. ఇప్పటికే ఆయనను ఎంతో మంది తిడుతున్నా తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. సరికదా మరింత ఎక్కువ ప్రేలాపనలు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ను ప్రేమించే వారు కర్ణాటక రాష్ట్రంలో ఉండొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. కర్ణాటకలోని యలబుర్గాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
టిప్పు సుల్తాన్ భజన చేసే వారిని కర్ణాటక నుంచి తరిమికొట్టాలని ప్రజలను కోరుతూ బీజేపీ చీఫ్ కటీల్ మరో వివాదాన్ని రేకెత్తించారు. రామ భజన చేసేవారు, హనుమంతుడిని ప్రార్థించేవారు మాత్రమే ఇక్కడ ఉండాలని సూచించిన ఆయన.. టిప్పు సుల్తాన్ అనుచరులందరినీ చంపేయాలని పిలుపునిచ్చారు. టిప్పు సుల్తాన్ వారసులు ఎవరు కూడా ఈ గడ్డపై ఉండకుండా తరిమి కొట్టి అడవులకు పంపాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను టిప్పు సుల్తాన్ వర్సెస్ సావర్కర్ మధ్య పోరుగా కటీల్ అభివర్ణించారు. అవసరం లేని టిప్పు జయంతి జరుపుకోవడానికి కాంగ్రెస్ అనుమతి ఇచ్చి సావర్కర్ను కించపరిచిందని కటీల్ ఇప్పటికే కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు.
రోడ్లు, డ్రైనేజీ వంటి పౌర సమస్యలపై కాకుండా లవ్ జిహాద్కు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలకు సూచించి నళినీ కుమార్ కటీల్ వార్తల ప్రధాన శీర్షికన చేరారు. మే నెలాఖరుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో హిందూ ఓట్లపై కన్నేసిన కటీల్ ఇలా మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడని కాంగ్రెస్, జనతాదళ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.