బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి (BJP) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న కమలం పార్టీకి మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు పలువురు నాయకులు ఇప్పటికే గుడ్బై చెప్పారు. తాజాగా మరో నాయకుడు పార్టీని వీడనున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ (Ayanur Manjunath) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. శివమొగ్గ (Shivamogga) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అది ఏ పార్టీ అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.
తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరికమేరకు ఎన్నికల బరిలో నిలబడనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించానని, బీజేపీని వీడనున్నట్లు చెప్పారు. అదేవిధంగా బుధవారం సాయంత్రం విధాన సభ చైర్మన్ బసవరాజ్ హోరట్టిని కలువనున్నానని, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కాగా, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా స్పష్టత నివ్వకపోవడం విశేషం.