బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు. కరోనా సోకిన నర్సింగ్ విద్యార్థులను క్వారంటైన్ కేంద్రంలో ఐసొలేషన్లో ఉంచినట్లు చెప్పారు. వైరస్ వేరియంట్ నిర్ధారణ కోసం వారి నమూనాలను ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు.
హసన్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో 13 మంది విద్యార్థులు, చామరాజనగర్లోని వైద్య కళాశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన ఒక రోజు తర్వాత తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన విద్యార్థులలో చాలా మంది కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో సుమారు 281 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల జరిగిన ఒక పార్టీకి హాజరైన, లేదా ఆ పార్టీకి హాజరైన వ్యక్తుల ద్వారా కరోనా సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్ చర్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై బుధవారం స్పందించారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్లను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో చర్చిస్తానని ఆయన తెలిపారు.