Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆటలు కర్ణాటకలో సాగవు అని కన్నడిగులు పేర్కొంటున్నారు. ‘తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం’ అన్నచందంగా పార్టీలో వారిద్దరి దూకుడుకు జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవది రూపంలో కళ్లెం పడిందని అంటున్నారు. తాము ఏ తప్పు చేయలేదని, అక్రమాలకు పాల్పడలేదని.. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలకు భయపడే ప్రసక్తే లేదని ‘బీజేపీ దర్యాప్తు సంస్థల రాజకీయాన్ని’ ముందుగానే ఊహించి జగదీశ్ శెట్టర్ స్పష్టం చేశారు. వీరిద్దరు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరటంతో వారి సొంత నియోజకవర్గాలైన హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్, అథణి నుంచే హస్తం పార్టీ వారికి సీటు ఇచ్చింది.
జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవది.. ఒకరు సీఎం, మరొకరు డిప్యూటీ సీఎంలుగా చేసిన వ్యక్తులు. వీరిద్దరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గుడ్బై చెప్పి, కాంగ్రెస్లో చేరారు. సీనియర్ నేతలైన శెట్టర్, లక్ష్మణ్లిద్దరూ ఉత్తర కర్ణాటకకు చెందిన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారు. వీరిద్దరికి ఆ రీజియన్లో గట్టి పట్టు ఉన్నది. ఇదే సమయంలో బీజేపీ కురబ నాయకుల్లో ప్రముఖుడైన అమరసింగ్ పాటిల్ కూడా సోమవారం కాంగ్రెస్లో చేరారు. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో జగదీశ్ శెట్టర్కు రాజకీయంగా, బంధువులు, అనుచరగణం పరంగా బలం ఉన్నది. 20-25 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50కి గానూ 30 స్థానాల్లో బీజేపీ గెలిచింది. మెజార్టీ లింగాయత్ల మద్దతుతో గెలుస్తున్న బీజేపీకి.. అదే లింగాయత్ నేతలపై జగదీశ్ శెట్టర్, లక్ష్మన్ సదవి నేతల తిరుగుబాటుతో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నదని చెప్తుతున్నారు. జగదీశ్ శెట్టర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా మంగళ, బుధవారాల్లో శెట్టర్ నియోజకవర్గం హుబ్బళ్లిలోనే మకాం వేయనున్నారంటే బీజేపీ ఆందోళన ఇక్కడ తెలుస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
1980వ దశాబ్దంలో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ కర్ణాటక సీఎంగా ఉన్న వీరేంద్ర పాటిల్ను దించి బంగారప్పకు పట్టం కట్టారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వీరేంద్ర పాటిల్కు జరిగిన అవమానం అత్యధిక లింగాయతులు తమదిగా భావించి కాంగ్రెస్కు దూరమయ్యారు. తొలుత జనతాదళ్ వైపు, తర్వాత బీజేపీ వైపు మళ్లారు. లింగాయతుల్లో 60 శాతం మంది మద్దతు బీజేపీకి ఉన్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉన్నది. వీరేంద్ర పాటిల్కు అవమానం జరిగిందనే అంశాన్ని లింగాయతుల్లో ప్రభలంగా నాటడంలో రామకృష్ణ హెగ్డే నాయకత్వంలోని అప్పటి జనతాదళ్ ప్రభుత్వం విజయవంతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథా అనుసరిస్తున్నది. బీజేపీ లింగాయత్లను అవమానించిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.