Kangana on Gandhi | వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. వారం రోజుల క్రితం పద్మ అవార్డు అందుకున్న అనంతరం కంగన భారత స్వాతంత్య్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి గాంధీజీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. మహారాష్ట్ర కాంగ్రెస్ కంగనపై లీగల్ చర్యలకు సిద్ధపడుతోంది.
ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు నానా పటోలే.. కంగన మీద ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ‘1947లో గాంధీ నేతృత్వంలో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష.. మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో’ అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కంగన మాటలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదం సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది కంగన. ఈ సారి ఏకంగా జాతిపిత మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. గాంధీ, నెహ్రు, ఇంకా మిగతా నేతలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధపడ్డారు అనే హెడ్లైన్తో ఉన్న న్యూస్ క్లిప్పింగ్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ…
‘మీరు గాంధీ అభిమానా? నేతాజీ మద్దతుదారులా? రెండూ అవడం కుదరదు. తెలివిగా నిర్ణయించుకోండి’ అని రాసుకొచ్చింది. ఈ పేపర్ క్లిప్పింగ్లో గాంధీజీ, నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా వంటి నేతలు నేతాజీ దేశంలోకి ప్రవేశిస్తే అతన్ని బ్రిటీష్ వారికి అప్పగిస్తామని ఓ బ్రిటీష్ జడ్జీతో ఒప్పందం కుదుర్చున్నట్లు ఉంది.
ఈ పేపర్ క్లిప్పింగ్ను షేర్ చేయడంతో పాటు ‘భగత్సింగ్ను ఉరి తీయాలని గాంధీ కోరుకున్నారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె పద్మ అవార్డును తిరిగి తీసుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.