భోపాల్ : 70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందన్న కాషాయ పార్టీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నేత కమల్ నాధ్ దీటుగా బదులిచ్చారు. గతంలో తాము నిర్మించిన స్కూళ్లు, కాలేజీల్లో మీరు చదువుకున్నారని కాషాయ నేతలను ఉద్దేశించి కమల్ నాధ్ అన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా దివంగత నేతకు నివాళులు అర్పిస్తూ కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆధునిక భారత్ నిర్మాణానికి పండిట్ నెహ్రూ పునాది వేశారని చెప్పారు. ఎయిమ్స్, ఐఐటీ, స్కూళ్లు, కాలేజీలను నెహ్రూ తన హయాంలో నిర్మించారని గుర్తుచేశారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. పండిట్ నెహ్రూ దేశంలో కీలక వ్యవస్ధలను నిర్మిస్తే కాషాయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని రాహుల్ ఆరోపించారు.
ఐఐటీ, ఐఐఎం, ఎల్ఐసీ, ఐటీఐ, బీహెచ్ఈఎల్, ఎన్ఐడీ, ఎయిమ్స్, ఇస్రో, సెయిల్, ఓఎన్జీసీ, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను నెహ్రూ నిర్మించారని ఆయన వ్యవస్ధల నిర్మాతని కొనియాడారు. నెహ్రూ వ్యవస్ధలను నిర్మిస్తే బీజేపీ వ్యవస్ధలను కూల్చివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.