భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath) మరోసారి కలకలం రేపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ నాథ్ శనివారం బేతుల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడారు. ప్రసంగం ముగింపులో ‘జై శ్రీరామ్’ అని అన్నారు. అలాగే ‘జై శ్రీరామ్’ అనాలని జనాలను కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కాంగ్రెస్ నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కమల్ నాథ్ ఆ పార్టీ వీడుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రచారం జరిగింది. కుమారుడికి సీటు ఖరారు కాకపోవడంతో నకుల్ నాథ్తో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. అక్కడ తన ఇంటిపై ‘జై శ్రీ రామ్’ అని ఉన్న జెండాను ఎగురవేశారు. దీంతో కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఆ జెండాను ఆయన తొలగించారు. రెండు రోజుల తర్వాత తాను కానీ, తన కొడుకు కానీ బీజేపీలో చేరే అవకాశం లేదని కమల్ నాథ్ స్పష్టం చేశారు.