భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ (Kamal Nath) దాటవేత ధోరణితో వ్యవహరించారు. చింద్వారాలో విలేకరులు ఈ విషయం ప్రస్తావించగా అఖిలేష్ విషయం వదిలేయండని అంటూ అఖిలేష్, వఖిలేష్ గురించి మరిచిపోండని వ్యాఖ్యానించారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘనవిజయం సాధిస్తామని కమల్ నాధ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అంచనాలకు మించి పెద్దసంఖ్యలో తమ అభ్యర్ధులు విజయం సాధిస్తారని అన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలపడంపై తమ పార్టీ పునరాలోచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్ధాయిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మధ్యప్రదేశ్లో 18 స్ధానాల్లో పరస్పరం తలపడుతున్నాయి. ఈ పరిణామం బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలికకు దారితీసి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
ఈ దిశగా తాము మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్తో చర్చించామని, పార్టీ సామర్ధ్యంపై తాము చర్చించామని, గతంలో తమ ఎమ్మెల్యేలు గెలిచిన స్దానాలు, రెండో స్ధానంలో నిలిచిన నియోజకవర్గాలపై సంప్రదింపులు జరిపామని చెప్పారు. తమకు ఆరు స్ధానాలు కేటాయించేందుకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించినా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో పొత్తులుండవని తనకు తెలిస్తే తాము కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపేవారం కాదని పేర్కొన్నారు. వారు తమతో ప్రవర్తించిన తరహాలోనే తామూ వ్యవహరిస్తామని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు దిశగా చర్చలు జరపబోమని అఖిలేష్ యాదవ్ తేల్చిచెప్పారు.
Read More :
Viral Video | నవరాత్రి వేడుకల్లో ట్విస్ట్ : నీటి లోపల గర్భాతో అదరగొట్టాడు