Hefty fine : పౌరులు ట్రాఫిక్ రూల్స్ను అనుసరించాలని పోలీసులు ఎప్పుడూ చెబుతుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనవల్ల ఇతర వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పోలీసులు హెచ్చరించినా జనం పట్టించుకోరు. ఆఖరికి జరిమానాలు విధిస్తున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించింది.
తన యాక్టివాపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ రూట్లో నడపడం, ట్రిపుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాలుగా ఆమె ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించింది. ఆమె ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు సంబంధించిన దృశ్యాలు నగరంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో పోలీసులు పలుమార్లు పెండింగ్ జరిమానాలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. అయిన ఆసదరు మహిళ లెక్కచేయలేదు. జరిమానాలు చెల్లించలేదు.
మొత్తం 270 సార్లు ఆమె ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన పోలీసులు.. అన్నింటికి కలిపి రూ.1.36 లక్షల భారీ జరిమానా విధించారు. ఇప్పటికైనా జరిమానా మొత్తం చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ట్రాఫిక్ చలానాలో వసూలు విషయంలో బెంగళూరు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. గత ఫిబ్రవరిలో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.3.2 లక్షల జరిమానా వసూలు చేశారు.
మిగతా వాళ్ల నుంచి పెండింగ్ చలానాలను రాబట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా సదరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా విధించారు. అంతేగాక బెంగళూరు సిటీలో ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. మొత్తం 2,681 మందిపై రూ.50 వేలకు పైగా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై తాము సీరియస్గా ఉన్నామని తెలిపారు.