ఇండోర్ : బీజేపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయ మహిళల వస్ర్తధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డర్టీ డ్రెస్సులు వేసుకొనే బాలికలు, మహిళలు అందరూ తన కంటికి శూర్పనఖలా కనిపిస్తారని అన్నారు. వారికి మంచి వస్ర్తాలు ధరించాలని తల్లిదండ్రులు సూచించాలని సలహా ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్తోపాటు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ తక్షణమే దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ గురువారం నిర్వహించిన హనుమత్ జయంతి వేడుకలో విజయ్వర్గీయ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై ఎంత ద్వేషం ఉన్నదో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నదని విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంగీత శర్మ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారని, వారి వైఖరి వారి వ్యాఖ్యల్లో వెల్లడవుతున్నదని విమర్శించారు.