పిత్తోర్ఘర్: వరుసగా నాలుగో ఏడాది కూడా మానససరోవర యాత్రకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని ఆ యాత్రను నిర్వహించే నోడల్ ఏజెన్సీ పేర్కొన్నది. ఉత్తరాఖండ్లోని పిత్తోర్ఘర్ జిల్లాలో ఉన్న లిపులేక్ పాస్ ద్వారా యాత్రికులు మానస సరోవరం చేరుకుంటారు. అయితే కోవిడ్ కారణంగా 2022 నుంచి ఆ యాత్రను నిలిపివేశారు. 2019లో చివరి సారి లిపులేక్ రూట్ ద్వారా మానస సరోవర యాత్రను చేపట్టారు.
మానస సరోవర యాత్రకు సంబంధించి విదేశాంగ శాఖ వద్ద కానీ అధికారిక వెబ్సైట్లో కానీ ఎటువంటి సమాచారం లేదని కుమావన్ మండల్ వికాశ్ నిగమ్ అధికారి ఏపీ వాజ్పేయి తెలిపారు. కేఎంవీఎన్ మానస సరోవర యాత్రను నిర్వహించే నోడల్ ఏజెన్సీ. సరోవర యాత్రపై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని పిత్తోర్ఘర్ జిల్లా మెజిస్ట్రేట్ రీనా జోషి తెలిపారు.
కైలాస మానస సరోవరానికి 1981 నుంచి లిపులేక్ రూట్లో యాత్రను నిర్వహిస్తున్నారు. టిబెట్లో ఉన్న ఆ పవిత్ర క్షేత్రానికి చేరుకునేందుకు ప్రతి ఏడాది ఈ రూట్లో వెయ్యి మంది యాత్రికులు వెళ్తుంటారు. మానస సరోవర యాత్రకు బదులుగా ఆది కైలాస్ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేఎంవీఎన్ అధికారి తెలిపారు. మానస సరోవర యాత్ర ప్రతి సంవత్సరం జూన్లో ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి హడావుడి లేకపోవడంతో ఆ యాత్రపై డౌట్ వస్తోంది.