న్యూఢిల్లీ: తండ్రి బాటలో తనయులు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య పార్టీలు మారి మూడు దశాబ్దాల తర్వాత తన తండ్రి చేపట్టిన పదవినే చేపట్టడం మాత్రం కచ్చితంగా విశేషమే. ఇప్పుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ అరుదైన ఘనతనే సొంతం చేసుకున్నారు. గతేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన.. బుధవారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఒక రకంగా తన తండ్రి మాధవరావ్ సింధియా రాజకీయ జీవితంతో జ్యోతిరాదిత్యకు చాలా పోలికలే ఉన్నాయి.
పౌర విమానయాన శాఖ
జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఆయన తండ్రి మాధవరావ్ సింధియా కూడా పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పని చేశారు. 1991 నుంచి 1993 మధ్య ఆయన ఈ శాఖా బాధ్యతలు నిర్వహించారు. ఇండియాలో కీలకమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సమయమది. ఇప్పుడు కొవిడ్ కారణంగా మరోసారి సంక్షోభంలో పడిన పౌర విమానయాన శాఖ బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా చేపట్టారు.
ఇద్దరూ.. అచ్చూ అలాగే..
తండ్రీతనయులు మాధవరావ్, జ్యోతిరాదిత్య ఇద్దరూ ఈ శాఖలు చేపట్టక ముందు కూడా కేంద్ర మంత్రులుగా పని చేసిన వాళ్లే కావడం ఇక్కడ మరో విశేషం. పౌర విమానయాన శాఖ చేపట్టకముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు మాధరావ్ సింధియా. జ్యోతిరాదిత్య కూడా గతంలో మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.
ఈ ఇద్దరు కూడా పార్టీలు మారిన వాళ్లే. కాకపోతే అది రివర్స్లో జరిగింది. మొదట్లో జనసంఘ్లో ఉన్న మాధవరావ్ సింధియా.. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే పౌర విమానయాన శాఖ మంత్రిగా మాత్రం మాధవరావ్ సింధియాకు కష్టాలు తప్పలేదు. రైల్వే మంత్రిగా శతాబ్ది రైళ్లను ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్న మాధవరావ్కు అలాంటి సంస్కరణలే విమానయాన శాఖలో ప్రవేశపెడదామనుకున్నా.. భంగపాటు తప్పలేదు.
ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆ తర్వాత ఓ విమాన ప్రమాదం కూడా జరగడంతో సింధియా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కూడా కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న పౌర విమానయాన శాఖ బాధ్యతలను జ్యోతిరాదిత్య చేపట్టారు. మరి ఈ సవాలును ఆయన ఎలా ఎదుర్కొంటారు చూడాలి.