ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గగనతలం ఆంక్షలు ఎత్తేయడంతోనే ఉక్రెయిన్కు ప్రత్యేక విమానాలను పునరుద్ధరిస్తామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కొన్ని రోజుల క్రితం ఓ విమానం వెళ్లిందని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా విమానాలను పంపామని, అయితే… రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగన తలాన్ని మూసేసిందని, అందుకే ఉక్రెయిన్ వెళ్లిన విమానాలు తిరిగి వచ్చేశాయని ఆయన వివరించారు. ఎప్పుడైతే గగనతలం తిరిగి ప్రారంభమవుతుందో.. ప్రత్యేక విమానాలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే.. అక్కడి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు.
ఉక్రెయిన్లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఉక్రెయిన్లో పరిస్థితులు గంభీర స్థితిలో ఉన్నాయని, అయినా భారతీయులను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.