న్యూఢిల్లీ, ఆగస్టు 25: భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు జడ్జీల కోసం కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ.. శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం వీడ్కోలు సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సీజేఐ రమణ మాట్లాడారు. ‘సీజేఐగా నా విధులను నిర్వర్తించేందుకు సాధ్యమైనంత మేర కృషిచేశా. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, జడ్జీల నియామకంపైనే ప్రధానంగా దృష్టిసారించా’ అన్నారు. లక్ష్యాన్ని సాధించడంలో సాయపడిన తోటి న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు.