Justice MR Shah | తాను రిటైర్డ్ అయ్యే వ్యత్తిని కానని, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభిస్తానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎంఆర్ షా సోమవారంతో పదవీకాలం ముగిసింది. నవంబర్ 2, 2018న సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆయన రిటైర్మెంట్తో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేఐతో కలిసి 32కి చేరింది. ఇంతకు ముందు జస్టిస్ దినేష్ మహేశ్వరి పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టులో చివరి రోజు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐ జిస్ట్ చంద్రచూడ్ నేతృత్వంలోని అధికారిక బెంచ్లో కూర్చున్న జస్టిస్ షా.. ప్రసంగించారు. తాను జీవితంలో కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించబోతున్నానని, తనకు బలం, ధైర్యం, ఆరోగ్యం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆయన.. ‘కల్ ఖేల్ మే హమ్ హో నా హో.. గార్దిష్ మే తారే రహేంగే సదా’ పాట గుర్తుకు వస్తుందన్నారు. తన ప్రసంగం ముగింపు సందర్భంగా ‘జీనా యహాన్, మర్నా యహాన్’ పాటను పాడారు.
వీడ్కోలు సందర్భంగా జస్టిస్ ఎంఆర్షాతో తనకున్న అనుబంధాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉన్నప్పటి నుంచి తనకు ఆయనతో అనుబంధం ఉందన్నారు. ఆయన సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత స్నేహం కొత్త మలుపు తిరిగిందన్నారు. కరోనా మహమ్మారి వంటి కష్టకాలంలోనూ కలిసి బెంచ్లో కూర్చున్నామన్నారు. జస్టిస్ షా ఎప్పుడూ సవాల్కు సిద్ధమని సీజేఐ ప్రశంసించారు. కొవిడ్ సమయంలో సవాల్గా తీసుకొని పని చేశారన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసేందుకు సహకరించిన బార్ సభ్యులు, సుప్రీంకోర్టు అధికారులు, సహాయ సిబ్బందికి జస్టిస్ షా కృతజ్ఞతలు తెలిపారు. తాను అర్హుడో కాదో నాకు తెలియదని.. అయితే, వీడ్కోలను బహుమతిగా స్వీకరిస్తున్నానని షా పేర్కొన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. తనపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతలకు పొంగిపోయానని, అందరికీ తాను కృతజ్ఞడినన్నారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సహా బార్ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ షాకు అభినందనలు తెలిపారు. జస్టిస్ షా తనకు న్యాయవాదిగా కూడా తెలుసునని, అతికొద్ది మంది ధైర్యవంతుల్లో ఆయన ఒకరని జస్టిస్ మెహతా అన్నారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సైతం ఆయన సేవలను కొనియాడారు.
జస్టిస్ ముఖేష్ కుమార్ రసిక్ భాయ్ షా మే 16, 1958న జన్మించారు. 19 జూలై, 1982న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. మార్చి 7, 2004న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 జూన్ 22న శాశ్వత న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆగస్టు 12, 2018న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 2, 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి ఆయన.. నేడు పదవీ విరమణ చేశారు.