న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని ప్రస్తుత సీజేఐకి న్యాయశాఖ లేఖ రాసింది.
దీనికి స్పందిస్తూ.. తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ లలిత్ పేరును సీజేఐ సిఫారసు చేశారు. ఈ లేఖను న్యాయశాఖ ప్రధాని పరిశీలనకు పంపనున్నది. ఆయన ఆమోదం తర్వాత ఆ లేఖ రాష్ట్రపతికి చేరుకుంటుంది.
రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ యూయూ లలిత్ ఆగస్టు 27న ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. అయితే, ఆయన పదవీకాలం మూడు నెలల్లోపే ముగియనున్నది. 74 రోజులపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8న రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లు.
జస్టిస్ లలిత్ 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్ తలాక్, కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు వంటి కీలక కేసుల తీర్పులను జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనమే వెలువరించింది. బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన వివాదాస్పద స్కిన్-టూ-స్కిన్ టచ్ తీర్పును జస్టిస్ లలిత్ బెంచ్ తోసిపుచ్చింది.