న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫారసుకు కేంద్ర ప్రభుత్వ ఆమోద ప్రక్రియ అనంతరం.. నవంబర్ 9న జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 50వ సీజేఐగా బాధ్యతలు చేపడుతారు. సరిగ్గా రెండేళ్ల పదవీ కాలంతో ఆయన 2024, నవంబర్ 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. వారసుడిని సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈనెల 7న సీజేఐ జస్టిస్ లలిత్కు లేఖ రాశారు. సీజేఐగా జస్టిస్ లలిత్ పదవీ కాలం నవంబర్ 8తో ముగియనున్నది.
కీలక తీర్పులు..
సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ (1978-1985) కుమారుడే జస్టిస్ డీవై చంద్రచూడ్. 1959, నవంబర్ 11న మహారాష్ట్రలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో రెండు అడ్వాన్స్డ్ డిగ్రీలు పొందారు. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 39 ఏండ్లకే బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది అయ్యారు. 1998లో భారత అదనపు సొలిసిటర్ జనరల్గా సేవలు అందించారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013-16 మధ్య అలహాబాద్ హైకోర్టు సీజేగా పనిచేశారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అయోధ్య భూవివాదం, గోపత్య హక్కు సహా పలు కీలక కేసులపై తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.
తండ్రి తీర్పులను తిరగరాసి..
సీజేఐలుగా పనిచేసిన తండ్రి, కొడుకులుగా జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ డీవై చంద్రచూడ్ చరిత్రలో నిలువనున్నారు. వ్యభిచారం, వ్యక్తిగత గోప్యతలపై గతంలో జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన రెండు తీర్పులను కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రద్దు చేస్తూ కొత్త తీర్పులు వెలువరించడం గమనార్హం.