న్యూఢిల్లీ:పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్(Justice Anupinder Grewal).. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యారు. అయిదేళ్ల కాలపరిమితి కోసం ఆయన్ను నియమించారు. లేదా 67 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ ప్రెసిడెంట్గా జస్టిస్ రామలింగం సుధాకర్ పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. 2021, నవంబర్ ఒకటో తేదీ నుంచి రామలింగం ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఎన్సీఎల్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
జస్టిస్ గ్రేవాల్ 1964, మార్చి 10వ తేదీన జన్మించారు. పంజాబ్లోని లుథియానా జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 1992లో ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టులో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పంజాబ్ ప్రభుత్వ లా ఆఫీసుల్లో ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. 1995 నుంచి 97 వరకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా, 97 నుంచి 2002 వరకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్గా, 2002 నుంచి 2005 వరకు సీనియర్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్గా చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్గా చేశారు.
అనేక కేంద్ర ప్రభుత్వ కేసుల్లో ఆయన వాదించారు. 2014 సెప్టెంబర్ 25వ తేదీన పంజాబ్-హర్యానా హైకోర్టు అదనపు జడ్జీగా ఆయనకు పదోన్నతి దక్కింది. ఆ తర్వాత ఆయన రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. 2016 మే నెలలో ఆయన పర్మనెంట్ జడ్జీ అయ్యారు. 2026, మార్చి 10వ తేదీన జడ్జీగా ఆయన రిటైర్ అయ్యారు.