Article 370 | న్యూఢిల్లీ, డిసెంబర్ 10: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుందా అన్న అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 16 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులు.
వాదోపవాదాలు..
విచారణ సందర్భంగా పిటిషనర్లను సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది. రాజ్యాంగ పరిషత్తు ఉనికిలో లేనప్పుడు, అధికరణం 370 రద్దుకు ఎవరు సిఫారసు చేయగలరని ప్రశ్నించింది. ఒక అధికరణ(ఆర్టికల్ 370) తాత్కాలికమైనదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నప్పుడు.. జమ్ముకశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు 1957లో ముగిసిన తర్వాత ఆ అధికరణ ఎలా శాశ్వతం అవుతుందని పిటిషనర్లను అడిగింది.
అయితే 370 రద్దును వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. జమ్ముకశ్మీర్ రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు ముగిసిందని, ఈ నేపథ్యంలో ఆ అధికరణను రద్దు చేయలేరన్నారు. రాజ్యాంగ పరిషత్తు ముగియడంతో ఆర్టికల్ 370 శాశ్వత హోదా పొందిందని తెలిపారు. అయితే ఈ అధికరణను రద్దు చేయడంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది.
తీర్పుపై రాజకీయాలొద్దు..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వెలువరిస్తుందని, ఆర్టికల్ 370ని కోర్టు పునరుద్ధరిస్తుందని గుప్కార్ కూటమి పార్టీలు ఆశాభావం వ్యక్తంచేశాయి. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని.. రాజకీయాలు చేయొద్దని బీజేపీ సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా తమ పార్టీ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిందని, చట్టప్రకారం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదిగా తేలుతుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రజలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉంటుందని డీపీఏపీ అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. మత పరమైన సున్నిత సమాచారాన్ని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని సోషల్ మీడియా యూజర్లకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.