కటక్, జూలై 7: నిజాయతీ గల స్నేహంతో మొదలైన ఒక బంధం కొన్నేండ్ల తర్వాత చేదుగా మారి.. ఆ బంధంలోని పురుషుడు మహిళను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే.. ఇంతకాలం సాగిన వారి లైంగిక సాన్నిహిత్యాన్ని మోసపూరితమైనదిగా భావించరాదని ఒరిస్సా హైకోర్టు ఈ నెల 3న చారిత్రక తీర్పును ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో సదరు పురుషుడు మహిళపై లైంగిక దాడి(రేప్) చేశాడని ఆరోపించలేమని తెలిపింది. అతడిపై నమోదైన లైంగిక వేధింపులను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. లైంగిక సాన్నిహిత్యాన్ని ఎల్లప్పుడూ లైంగిక దాడిగా పరిగణించకూడదని తెలిపారు.
మొదట్లో కొన్ని కారణాల వల్ల అతడు ఆమెను పెండ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ చివరికి అందుకు సిద్ధంగా లేడని పేర్కొన్నారు. అయితే ఆమె బ్లాక్మెయిల్ చేయడంతో పెండ్లికి అతడు అంగీకరించాడని..కానీ ఆశ్చర్యంగా 2021లో ఆమె అతడితో ఒక ఒప్పందం చేసుకున్నదని జడ్జి వివరించారు. సంబంధాన్ని కొనసాగించడంలో ఇద్దరూ కష్టాలు ఎదుర్కొన్నారని, బంధాన్ని సాగించ డంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం తెలిసీ కూడా వారు తమ సంబంధాన్ని కొనసాగించారని జడ్జి తెలిపారు.