జార్ఖండ్లో వాహనంతో ఢీకొట్టి దారుణం
ఓ కేసులో గ్యాంగ్స్టర్లకు బెయిల్ ఇవ్వలేదన్న కక్షతో!
ఢిల్లీ/రాంచీ, జూలై 29: జార్ఖండ్లోని ధన్బాద్ కోర్టు జిల్లా, సెషన్స్ జడ్జి-8 ఉత్తమ్ ఆనంద్ (49) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆటోతో ఢీకొట్టి దారుణానికి పాల్పడ్డారు. ఆయ న మృతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ‘సిట్’ దర్యాప్తునకు ఆదేశించింది. జడ్జి ఆనంద్ బుధవారం ఉదయం జాగింగ్కు వెళ్లినప్పుడు వెనుక నుంచి వచ్చిన ఒక పెద్ద ఆటోరిక్షా ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జిల్లా కోర్టు సమీపంలోని రణధీర్వర్మ చౌక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలై నెత్తుటి మడుగులో విలవిలలాడుతున్న జడ్జిని ఆటో డ్రైవర్ ఒకరు గమనించాడు. ఆయనను షాహిద్ నిర్మల్ మహతో వైద్య కళశాల దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ముందు ఈ ఘటనను ప్రమాదంగా పోలీసులు భావించారు. వాహనం ఢీకొట్టిన వీడియో బయటకురావడంతో పథకం ప్రకారం జరిగిన హత్యగా గుర్తించారు. జడ్జి ఆనంద్ హత్యను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్… ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇటీవల కొందరు గ్యాంగ్స్టర్లకు బెయిల్ ఇవ్వనందుకే జడ్జి ఆనంద్ను హత్య చేశారని ఆరోపించారు. ‘సిట్’తో దర్యాప్తు జరుపాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించిందని, అందుచేత ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజేఐ తెలిపారు. దీనిపై జార్ఖండ్ హైకోర్టు సీజేతో మాట్లాడానని చెప్పారు. కాగా, ఈ కేసులో లఖన్ వర్మ, రాహుల్ వర్మ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ధన్బాద్ ఎస్ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు.