పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పూర్వ కాలేజీలో చేదు అనుభవం ఎదురైంది. గో బ్యాక్ అంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ఏడు విభాగాల రెండు రోజుల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశం బీహార్లో జరుగనున్నది. దీనిని ప్రారంభించేందుకు జేపీ నడ్డా శనివారం పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చదివిన పాట్నా కాలేజీలో సెమినార్కు హాజరయ్యారు. నడ్డా తండ్రి కూడా పాట్నా యూనివర్సిటీలో పని చేశారు.
కాగా, నడ్డా రాకను ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) వ్యతిరేకించింది. నల్ల జెండాలతో ఆయనకు నిరసన తెలిపింది. నడ్డా గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ విద్యార్థులను అడ్డుకునేందుకు బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రయత్నించింది. దీంతో ఘర్షణను నివారించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.