న్యూఢిల్లీ, జనవరి 13: ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ మొత్తం కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. కేవలం 12 రోజుల్లోనే 5 సెంటీమీటర్ల భూమి కుంగిపోయినట్టు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)-హైదరాబాద్ శుక్రవారం ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కార్టోశాట్-2 ఉపగ్రహం ద్వారా జోషీమఠ్ పట్టణ చిత్రాలను సేకరించి, విశ్లేషించిన ఇస్రో.. జోషీమఠ్లో కుంగిపోనున్న ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఆర్మీ హెలిప్యాడ్, నర్సింగ్ ఆలయం సహా మొత్తం జోషీమఠ్ పట్టణం అంతా సెన్సిటివ్ జోన్లో ఉన్నట్టు ఈ చిత్రాల ద్వారా తెలుస్తున్నది.
ప్రమాదకర పరిస్థితులు..
జోషీమఠ్లో డిసెంబర్ 27 నుంచి జనవరి 8 వరకు 5.4 సెంటీమీటర్ల భూమి కుంగిపోయిందని ఎన్ఆర్ఎస్సీ నివేదిక తెలిపింది. 2180 మీటర్ల ఎత్తులో ఉన్న జోషీమఠ్-ఔలీ రోడ్డు కూడా ప్రమాదకరంగా మారినట్టు పేర్కొన్నది. గత ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య 9 సెంటీమీటర్ల భూమి కుంగినట్టు పేర్కొన్నది. భూమి కుంగిపోతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న 169 కుటుంబాలకు చెందిన 589 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సహాయం కింద 42 కుటుంబాలకు రూ.1.5 లక్షలు అందజేశారు.
ఎన్జీపీసీ ప్రాజెక్టు కారణమా?
జోషీమఠ్ కుంగిపోవటానికి ఎన్టీపీసీ ప్రాజెక్టు కారణమా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 8 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రాజెక్టుకు, జోషీమఠ్ పట్టణం కుంగిపోవటానికి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీపీసీ తెలిపింది. తపోవన్, విష్ణుగడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుసంధానమై ఉన్న 12 కిలోమీటర్ల టన్నెల్.. జోషీమఠ్కు 1 కిలోమీటరు దూరంలో ఉన్నదని, అది కూడా భూ ఉపరితలం నుంచి 1 కిలోమీటరు లోతులో ఉన్నదని పేర్కొన్నది.
తూర్పు, పశ్చిమ కనుమలకూ ముప్పు!
బెంగళూరు, జనవరి 13: అభివృద్ధి కార్యకలాపాలు ఆపకపోతే జోషీమఠ్లో జరిగిందే తూర్పు, పశ్చిమ కనుమల్లో జరుగుతుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే ఈ కనుమల్లో తరచూ భూకంపాలు, కొండ చరియలు విరగడం, వరదలు సంభవిస్తున్నాయని.. వీటిని ప్రభుత్వాలు, స్థానికులు విస్మరిస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే ఈ ప్రాంతాల్లో భూ గర్భాన్ని మ్యాపింగ్ చేయాలని, బండ రాళ్లు పేల్చడం, రోడ్లు, రిసార్టుల నిర్మాణాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.