న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయిలో 8 శాతానికిపైగా నమోదైంది. దేశంలో లాక్డౌన్ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు నమోదవడం ఇదే తొలిసారి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మహేశ్ వ్యాస్ తాజాగా ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు.
10.9 శాతానికి పట్టణ నిరుద్యోగిత రేటు..
శ్రామికశక్తి పెరుగుతున్నదని, అయితే అందుకనుగుణంగా ఉద్యోగాల సృష్టి జరుగట్లేదని లేదని వ్యాస్ వెల్లడించారు. ఈ నెల 19తో ముగిసిన వారానికి, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయిలో 10.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 8.4 శాతంగా నమోదైంది. గత నంబర్లో ఇది 7.6 శాతంగా ఉన్నది. గత కొన్ని నెలలుగా నిరుద్యోగం పెరుగడం ఆందోళనకరమని వ్యాస్ పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో తగ్గిన రెగ్యులర్ ఉద్యోగులు
కోట్లలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పని దిగ్విజయంగా చేస్తున్నది. ఓ వైపు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అడ్డికి పావుశేరుగా కట్టబెడుతున్న మోదీ సర్కారు వాటిల్లోని రెగ్యులర్ ఉద్యోగాలకు భారీస్థాయిలో కోతపెడుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014 తర్వాత రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతున్నది.
కేంద్ర సర్కారు స్వయంగా దీనిని బయటపెట్టింది. రాజ్యసభలో మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ ఒక ప్రశ్నకు సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఉద్యోగాల కోత గురించి లెక్కలు చెప్పారు. 2014 మార్చి 31 నాటికి కేంద్ర సంస్థల్లో 13.51 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 3.08 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారు. 2022 నాటికి రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 9.22 లక్షలకు తగ్గింది. అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 4.99 లక్షలకు పెరిగింది. పొదుపు, సామర్థ్యం పెంపు చర్యల్లో భాగంగా ఈ మార్పులు సంభవించినట్టు మంత్రి వివరించారు. తద్వారా సాధించిన మిగులు సొమ్మును మౌలిక వ్యవస్థల అభివృద్ధికి వినియోగిస్తున్నట్టు తెలిపారు.
ప్రైవేటీకరణతో రూ.4 లక్షల కోట్లు
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక వాటా విక్రయం, ఇతర డిజిన్వెస్ట్మెంట్ కార్యకలాపాల ద్వారా కేంద్రం రూ.4.04 లక్షల కోట్లు సమీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ స్వయా నా ఈ వివరాల్ని మంగళవారం వెల్లడించింది. ఇందులో అత్యధిక మొత్తం 59 కంపెనీల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించడం ద్వారా రూ.1.07 లక్షల కోట్లు సమకూరాయని, 10 దశలుగా ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా పీఎస్యూల వాటా విక్రయంతో గత ఎనిమిదేండ్లలో రూ.98,949 కోట్లు ఒనగూడినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇతర వివరాలు…