శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం కేసులను పరిశీలించాలని జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నియమించిన కమిటీ ఆదేశించడంతో ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలున్న, సహకరించే ఉద్యోగులను తొలగిస్తున్నది.
ఈ ఏడాది జూలైలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారులు, పోలీసు శాఖకు చెందిన ఇద్దరితో సహా 11 మంది ఉద్యోగులను ఈ ఆరోపణలపై ప్రభుత్వం తొలగించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వారి విభాగాల నుండి విజిలెన్స్ క్లియరెన్స్ పొందకపోతే పాస్పోర్ట్ జారీ చేయబోమని గత వారం ఉత్తర్వులు జారీ చేసింది.