న్యూఢిల్లీ : ఓ రైతు కుమారుడు.. దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ ( IES ) ఎగ్జామినేషన్లో రెండో ర్యాంకు సాధించాడు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ ఐఈఎస్లో రెండో ర్యాంకు సాధించి ప్రశంసలు పొందుతున్నాడు. అహ్మద్ ఖాన్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగింది. అనంత్ నాగ్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి 2016లో బీఏ ఉత్తీర్ణత సాధించాడు.
మొదట్నుంచి అత్యుత్తమ ప్రతిభావంతుడైన ఖాన్.. కశ్మీర్ యూనివర్సిటీలో ఎంఏ ఎకానమిక్స్లో ప్రవేశం పొందాడు. గతేడాది జేఆర్ఎఫ్ సాధించాడు. కోల్కతాలో ఎంఫీల్ పూర్తి చేశాడు. ఎంఫీల్ పట్టాను 2021, ఏప్రిల్లో పొందాడు. ఇక కొవిడ్ సమయంలో ఎంఫీల్ చేస్తూనే.. ఐఈఎస్ కోసం కఠినంగా చదివాను అని ఖాన్ తెలిపాడు. ప్రణాళికబద్దంగా చదవడం వల్లే మొదటి ప్రయత్నంలోనే ఐఈఎస్ ఎగ్జామినేషన్లో రెండో ర్యాంకు సాధించగలిగానని పేర్కొన్నాడు. ఖాన్ తండ్రి వ్యవసాయం చేస్తూ.. రిక్షాను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.