రాంచీ: ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది. (baby girl Survives Miraculously) జార్ఖండ్లోని పాలము జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హైదర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమండిహ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ శనివారం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒక చెరువు వద్దకు చేరుకుంది. తొలుత నాలుగేళ్ల కుమార్తె, రెండున్నర ఏళ్ల కుమారుడ్ని నీటిలోకి తోసింది. అనంతరం ఆరు నెలల పసి పాపను చేతిలో పట్టుకుని ఆ మహిళ కూడా చెరువులోకి దూకింది. అయితే ఆమె చేతిలోని బిడ్డ జారి చెరువుగట్టుపై పడింది. దీంతో లక్కీగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
మరోవైపు చెరువులో పడి మునిగిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబంలో గొడవ వల్ల ఆ మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏమిటన్న దానిపై ఆరా తీస్తున్నారు. కూలీ అయిన మహిళ భర్త మరో రాష్ట్రంలో ఉండగా ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు.