రాంచీ: జార్ఖండ్లోని గొడ్డ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్(school teacher).. తన వద్ద ఉన్న గన్తో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు తోటి టీచర్లు మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. రాంచీ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరయ్యాహట్ ఏరియాలో ఉన్న అప్గ్రేడ్ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఉదయం 11 గంటలకు పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలోనే ఆ టీచర్ కాల్చివేతకు తెగించాడు. గొడ్డ ఎస్పీ నాథూ సింగ్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు టీచర్ల మృతదేహాలు రక్తపుమడుగులో ఉన్నాయని, అందులో ఓ మహిళ మృతదేహం కూడా ఉందని ఆయన తెలిపారు. కాల్పులు జరిపిన టీచర్ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.