రాంచీ: జార్ఖండ్లో జాతీయ రహదారి దుస్థితిపై మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. గుంతలోని బురద నీటితో స్నానం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బుధవారం గొడ్డా జిల్లాలో గుంతల మయంగా ఉన్న జాతీయ రహదారిపై ఉన్న బురద నీటితో స్నానం చేశారు. ఆ రోడ్డు దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే బాగు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య జరిగే పోరులో నేను జోక్యం చేసుకోదలచుకోలేదు. ఇది NH-133. 2022 మేలో ఈ రహదారిని విస్తరించే బాధ్యతను అధికారులు తీసుకున్నారు. కానీ మరమ్మతులకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున దీనిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను’ అని ఆమె అన్నారు. బీజేపీ గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబేను కూడా ఆమె విమర్శించారు. ఇక్కడకు వచ్చి కూర్చొంటే ప్రజల బాధలు అర్థమవుతాయన్నారు.
కాగా, సీఎం సోరెన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ నిరసన తెలిపారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. ఈ రోడ్డు కోసం కేంద్రం ఆరు నెలల కిందట రూ.75 కోట్లు కేటాయించిందని తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఎమ్మెల్యే దీపికా పాండే ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అబాద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఆ ఎమ్మెల్యే బురద నీటితో స్నానం చేసి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Protest for Good #Roads.
Mahagama #Congress MLA Deepika Pandey Singh takes bath in a pothole filled with rain water at #Jharkhand's #Godda district to mark her protest.@INCIndia @nsui pic.twitter.com/F6SDNdD0XC— Deepak Mahato (@deepakmahato) September 21, 2022