రాంచి: జార్ఖండ్లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుపై ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఇవాళ సీఎం సోరెన్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అవినాష్ పాండేతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తనపై అనర్హత వేటు పడినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర గెస్ట్ హౌస్లో దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం గవర్నర్ నిర్ణయంలో ఆలస్యం ఎందుకు జరుగుతున్నదని మీడియా ప్రశ్నించగా.. మీ ప్రశ్నకు గవర్నరే సమాధానం చెబితే బాగుంటుందని సోరెన్ వ్యాఖ్యానించారు.
సమావేశంలో జరిగిన చర్చ గురించి ప్రశ్నించగా ప్రస్తుత పరిస్థితుల గురించే చర్చించామని తెలిపారు. జార్ఖండ్ సీఎం సోరెన్ అక్రమంగా తనకు తాను మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడని బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.