రాంచీ, సెప్టెంబర్ 5: జార్ఖండ్లో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విశ్వాస పరీక్ష నెగ్గారు. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి 48 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. 29 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు, 15 మంది కాంగ్రెస్.. ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐఎంఎల్ నుంచి ఒక్కొక్కరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే.. సొరేన్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. అయితే ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సభ్యులు వాకౌట్ చేశారు. బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఓటింగ్ సందర్భంగా సీఎం సొరేన్ మండిపడ్డారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. అక్కడ గెలిచేందుకు బీజేపీ మత ఘర్షణలు రెచ్చగొట్టి దేశంలో అంతర్యుద్ధం వంటి పరిస్థితులను తీసుకొస్తున్నదని ధ్వజమెత్తారు. ‘మా ప్రభుత్వానికి బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించి ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే. మా పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు బెంగాల్లో ఉన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు’ అని దుయ్యబట్టారు.