రాంచీ: యాసిడ్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఢిల్లీకి తరలించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఒకవైపు రాజకీయ చదరంగంలో బిజీగా ఉన్నప్పటికీ బాలికకు మెరుగైన చికిత్స అందించడంపై అధికారులతో చర్చించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో చావు బతుకుల మధ్య ఉన్న బాలికను చికిత్స నిమిత్తం ఢిల్లీకి ఎయిర్లిఫ్ట్ చేశారు. బాలికపై ఈ నెల 5 న యాసిడ్ దాడి జరిగింది. అప్పటి నుంచి రిమ్స్లోనే చికిత్స పొందుతున్నది. అయితే, బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.
జార్ఖండ్లోని చత్రా జిల్లాకు చెందిన 17 ఏళ్ల యాసిడ్ దాడి బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి విమానంలో పంపించారు. సదరు బాలికను ఢిల్లీలోని ఎయిమ్స్కు పంపించాలని ఇక్కడి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని మెడికల్ బోర్డు రెఫర్ చేసింది. దాంతో ఆమెను ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తరలించారు. రిమ్స్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఏర్పాటైన మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాలికను విమానంలో తరలించేందుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను సీఎం సోరెన్ ఆదేశించారు.
ఇలాఉండగా, విద్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ నెల 5 వ తేదీన బాలికపై యాసిడ్ దాడి జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడిని అదే రోజు అరెస్టు చేశారు. చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఛత్రా డిప్యూటీ కమిషనర్ అబు ఇమ్రాన్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందించినట్లు ఆయన చెప్పారు.