రాంచీ: జార్ఖండ్ మైనింగ్ కార్యదర్శి పూజ సింఘాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ అవినీతిపై దర్యాప్తులో నిధుల మళ్లింపు అంశం బయటపడింది. ఇది జరిగినప్పుడు పూజ సింఘాల్ ఖుంటి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు దారి మళ్లినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈడీ అధికారులు గత వారం ఆమె చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) సుమన్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా రూ.17 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పూజ సింఘాల్ సీఏతోపాటు మరి కొందరి పేర్లతో ఉన్న ఖరీదైన నాలుగు కార్లను కూడా అధికారులు సీజ్ చేశారు.
కాగా, జార్ఖండ్ ప్రభుత్వ మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ వినోద్ ప్రసాద్ సిన్హాను అవినీతి, మోసం కేసులో 2020 జాన్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎంఎన్ఆర్ఈజీఏ నిధుల దుర్వినియోగంపై ఆయనను ప్రశ్నించారు. దీంతో పూజ సింఘాల్కు దీనితో సంబంధం ఉందన్న విషయం బయటపడింది. ఆమెకు ఐదు శాతం కమిషన్ ఇచ్చినట్లు విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు రామ్ వినోద్ ప్రసాద్ తెలిపాడు. మరోవైపు ఈ అవినీతిలో పూజ సింఘాల్, ఆమె భర్తకు సుమారు రూ.1.43 కోట్లు ముట్టినట్లు ఈడీ ఆరోపించింది.