న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. శనివారం ఉదయం వర్చువల్ విధానంలో మొదలైన INDIA కూటమి సమావేశంలో కూటమి కన్వీనర్ పదవి చేపట్టేందుకు నితీశ్ విముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం. కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ నుంచే ఒకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నితీశ్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
లోక్సభ ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని చర్చించేందుకు ఇవాళ INDIA కూటమి వర్చువల్ విధానంలో సమావేశమైంది. సమావేశం అనంతరం ఎక్కడ ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రానుంది. కాగా, ఇవాళ్టి కూటమి సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మాయావతి డుమ్మా కొట్టారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు.
ఇదిలావుంటే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్కు వరుసగా 4, 7 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ ఆప్ మాత్రం ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమకే ఎక్కువ ఎంపీ స్థానాలు కావాలని పట్టుబడుతోంది. అంతేగాక గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో కూడా తాము పోటీ చేస్తామంటోంది. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా INDIA కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు అంత సులువు కాదని అర్థమవుతోంది. కాగా, నితీశ్ కుమార్ కన్వీనర్ పదవిపై ఆసక్తి కనబర్చక పోవడంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఆ పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం.