బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం కుమార స్వామి పేర్కొన్నారు. శనివారం ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ బీజేపీ అసమర్థ, అవినీతి పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని వ్యాఖ్యానించారు. జేడీఎస్కు పట్టున్న పాత మైసూరు ప్రాంతంలో పాగా వేసేందుకు హోంమంత్రి అమిత్ షా మండ్యలో పర్యటించటం గురించి మాట్లాడుతూ.. మండ్యకు అమిత్ షా వచ్చి పోయినంత మాత్రాన బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని అన్నారు. మండ్య జిల్లాలోని ఏడుకు ఏడు నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులే గెలుస్తారని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. ‘విద్యుత్తు కొరత, గుంటలు పడిన రోడ్డు, నీళ్లు రాని నళ్లాలు, డ్రైనేజీల గురించి కాకుండా లవ్ జిహాద్ గురించి మాట్లాడండి, దానికి వ్యతిరేకంగా పోరాడండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటీల్ పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వటం సిగ్గు చేటు’ అని వ్యాఖ్యానించారు.